
ప్రియుడితో కలిసి భర్త హత్య.. పట్టించిన మద్యం సీసా మూత
ఆళ్లగడ్డ పట్టణం: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేయించింది. ఈ సంఘటన ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆళ్లగడ్డకు చెందిన ఆంజనేయులు(32) పట్టణ శివారులోని సమీప పొలాల్లో మంగళవారం ఉదయం మృతిచెంది కనిపించాడు. సీఐ నాగరాజారావు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. తలపై ఎవరో బండరాయితో మోది అతడిని హత్య చేసినట్లు గుర్తించారు. భార్య సుబ్బులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. భార్యపై అనుమానం రావడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామానికి చెందిన గురు ప్రసాద్తో సుబ్బులుకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వారి బంధానికి ఆంజనేయులు అడ్డువస్తుండడంతో సుబ్బులు భర్త హత్యకు వ్యూహరచన చేసింది. సోమవారం రాత్రి తన ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించింది. గురు ప్రసాద్ తనవెంట ప్రొద్దుటూరుకు చెందిన షరీఫ్ను వెంట తీసుకువెళ్లాడు. ముగ్గురు కలిసి పట్టణ శివారులో మద్యం సేవించారు. అనంతరం మత్తులో ఉన్న ఆంజనేయులు తలపై గురు ప్రసాద్ మద్యం సీసాతో కొట్టి, బండరాయితో మోదాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం సీసా మూతపై ఉన్న క్యూఆర్ కోడ్ సాయంతో పోలీసులు దానిని ఎవరు ఏ షాప్లో కొనుగోలు చేశారనేది సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను బుధవారం అరెస్టు చేశారు. ముగ్గురిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు
